ఇదేం కర్మరా బాబు.. తండ్రి కొడుకులు ఇలా వేధిస్తున్నారు – విజయసాయి రెడ్డి

టీడీపీ పార్టీ తాజాగా ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పరిధిలోని విజయరాయిలో చంద్రబాబు ఈ కార్యక్రమం చేపట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు. కాగా ఈ కార్యక్రమం ఫై వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తనదైన శైలి లో స్పందించారు.

ఇదేం కర్మరా బాబు.. తండ్రి కొడుకులు ఇలా వేధిస్తున్నారు అని లోకేశ్, బాబు లపై విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. మూడున్నరేళ్ల వైస్సార్సీపీ పాలన తర్వాత ఏపీ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై సంపూర్ణ సంతృప్తి, విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు.ఏపీ చరిత్రలో, ఇంకా చెప్పాలంటే దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ముందెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో జగన్‌ సర్కారు పుణ్యమా అని తెలుగునాట పేదలు, దిగువ మధ్య తరగతి చేతుల్లో డబ్బు కొరత లేదన్నారు. పిల్లల చదువుసంధ్యల నుంచి వృద్ధుల సంక్షేమం వరకూ జన జీవనం దిగుల్లేకుండా సాగిపోతోంది. సాధారణ ప్రజానీకం అవసరాలు ఎలాంటి బాదరబందీ లేకుండా తీరిపోతున్నాయి. ఈ సంతోషకర సమయంలో చంద్రబాబు నాయుడు గారికి హఠాత్తుగా 2024 ఏప్రిల్‌–మేలో జరిగే అసెంబ్లీ, లోక్‌ సభ ఎన్నికలు కనిపించాయి. ఆ ఎన్నికల్లో తన పార్టీ కనీసం పోటీలో ఉండాలంటే ఇప్పుడైనా ‘కాస్త బాగా’ ప్రజల మధ్య తిరగాలన్నారు.