విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిష‌న్‌పై విచార‌ణ‌ వాయిదా

విచారణ ఈ నెల 13కు వాయిదా..కౌంట‌ర్ దాఖ‌లుకు మ‌రింత గ‌డువు కోరిన సీబీఐ

అమరావతి : వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ‌రాజు దాఖ‌లు చేసిన‌ పిటిషన్ పై తదుపరి విచార‌ణను సీబీఐ కోర్టు ఈ నెల 13కు వాయిదా వేసింది. విజయసాయిరెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించారంటూ ఈ నెల 7న‌ రఘురామ కృష్ణ‌రాజు పిటిషన్ వేసిన విష‌యం తెలిసిందే. దీంతో బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణలో భాగంగా విజయసాయిరెడ్డికి, సీబీఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. ర‌ఘురామ వేసిన‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే ఈ రోజు విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.

అయితే, కౌంటర్‌ దాఖలుకు మరింత గడువు కావాలని సీబీఐ అధికారులు కోరారు. ఈ నేప‌థ్యంలోనే విచార‌ణ వాయిదా ప‌డింది. ఇప్ప‌టికే అక్ర‌మాస్తుల కేసులో సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని ర‌ఘురామ వేసిన పిటిష‌న్‌పై కూడా కోర్టులో విచార‌ణ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/