నారాయణ బెయిల్ ఫై బయటకొచ్చినప్పటికీ తప్పించుకోలేడు – విజయసాయి
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ పదో తరగతి ప్రశ్న పత్రాల లీక్ వ్యవహారం లో అరెస్ట్ అయ్యి..బెయిల్ ఫై బయటకొచ్చిన సంగతి తెలిసిందే. బెయిల్ ఫై బయటకొచ్చినప్పటికీ నారాయణ..నైతికంగా మాత్రం తప్పించుకోలేరని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.
నారాయణకు బెయిల్ వచ్చిన విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి… విద్యా సంస్థల ఛైర్మన్ పదవికి తానెప్పుడో రాజీనామా చేశానని చెప్పి బెయిలు తెచ్చుకున్నారని విమర్శించారు. సాంకేతికంగా నారాయణ బయటపడి ఉండొచ్చునన్న సాయిరెడ్డి.. నైతికంగా మాత్రం తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. నారాయణ కుటుంబానికి చెందిన సంస్థల్లో పేపర్లు బయటికొచ్చాయన్న సాయిరెడ్డి… ఈ వ్యవహారంలో ఎవరు ఓడారో ప్రజలకు అర్థమైందని ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
మంగళవారం నారాయణను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి , చిత్తూరుకు తీసుకొచ్చిన పోలీసులు , ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల నిర్వహించారు. అనంతరం నారాయణను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, పోలీసుల అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు న్యాయమూర్తికి ఆధారాలు చూపించారు.
దీంతో ఆ వాదనలు విన్న న్యాయమూర్తి ఏకీభవించారు. రూ.లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. బెయిలు లభించిన అనంతరం నారాయణ మాట్లాడుతూ.. నారాయణ విద్యాసంస్థల అధినేతగా తాను 2014లోనే తప్పుకున్నా, ఇంకా దాని అధినేతగానే ఉన్నానని పోలీసులు తనపై తప్పుడు అభియోగం మోపారని అన్నారు. దానితో తనకు ఎలాంటి సంబంధమూ లేదని కోర్టుకు ఆధారాలు సమర్పించామని, దీంతో తనపై మోపిన నేరారోపణ నమ్మేలా లేదన్న అభిప్రాయానికి వచ్చిన న్యాయమూర్తి బెయిలు మంజూరు చేసినట్టు తెలిపారు.