మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన పెద్దిరెడ్డి, వేణుగోపాలకృష్ణ

సచివాలయం రెండో బ్లాక్‌లో వేణుగోపాలకృష్ణ బాధ్యతలు

అమరావతి : ఏపీ మంత్రులుగా నిన్న 25 మంది ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. ఈ రోజు ప‌లువురు ఆయా మంత్రిత్వ శాఖ‌ల‌ మంత్రులుగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. సచివాలయం రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, ఐ అండ్‌ పీఆర్‌ శాఖ మంత్రిగా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.

2001లో రాజోలు జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందిన వేణుగోపాలకృష్ణ అనంత‌రం రాజ‌కీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 2008-12లో తూర్పుగోదావరి డీసీసీ అధ్యక్షుడిగా, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. అనంతరం 2013లో వైస్సార్సీపీ కాకినాడ రూరల్‌ కో ఆర్డినేటర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వేణుగోపాలకృష్ణ 2019లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయ‌న‌కు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో రెండోసారి కూడా అవకాశం వ‌చ్చింది.

అలాగే, గనులు, విద్యుత్‌, అటవీశాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో పెద్దిరెడ్డి దంపతులు, ఎంపీ మిథున్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైస్సార్సీపీలో ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. తాను తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడానని, జగన్‌ని పిన్నెల్లి కలుస్తారని చెప్పారు. అలాగే, అన్నా రాంబాబు, సామినేని ఉదయభానులతో కూడా మ‌ట్లాడాన‌ని తెలిపారు. వారికి పార్టీ గుర్తింపు, గౌరవం వుంటాయని అన్నారు.

త‌న‌కు ఇచ్చిన మూడు శాఖల్లో మంచి పేరు తెచ్చేందుకు కృషి చేస్తాన‌ని పెద్దిరెడ్డి అన్నారు. ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్‌ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, ఏపీలో పరిశ్రమలకు పవర్ హాలిడే లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు. గనుల శాఖలో చేపట్టిన సంస్కరణల వలన ఆదాయం పెరిగిందని, దాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాగా, 2019లోనూ మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా పెద్దిరెడ్డి పనిచేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/