గడప గడపకు కార్యక్రమంలో ప్రశ్నించిన యువకుడిపై మాజీ మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం

గడప గడపకు మన ప్రభుత్వ కార్య క్రమంలో వైసీపీ నేతలకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. కొట్టడం ఒక్కటే తక్కువ అన్నట్లు ఉంది. ఆ నేత..ఈ నేత అని కాదు ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలే ఎదురువుతున్నాయి. బయటకు ఈ కార్యక్రమం బాగా జరుగుతుందని , ప్రతి చోట ప్రజలు అభినందలు తెలుపుతున్నారని, మళ్లీ జగన్ ప్రభుత్వమే కావాలని అంటున్నారని నేతలు బయటకు చెపుతున్నారు కానీ అక్కడ జరిగేది మాత్రం మీ ప్రభుత్వానికి ఓటేసినందుకు చెప్పలేసుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగగా..తాజాగా విజయవాడ 50 డివిజన్ లో మాజీ మంత్రి వెల్లంపల్లి పర్యటిస్తుండగా..ఓ యువకుడు ప్రశ్నించగా అతడి ఫై వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేసారు.

వివరాల్లోకి వెళ్తే ..

50 వ డివిజన్​కు చెందిన నాగబాబు అనే యువకుడు..తాను గత కొంతకాలంగా చెన్నైలో పనిచేస్తున్నానని, దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో చెత్తపన్ను భారం మోపుతున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి వద్ద వాపోయారు. ఈ పన్ను భారం తమది కాదని.. కేంద్ర ప్రభుత్వం వేసిందని వెల్లంపల్లి బదులివ్వగా.. తమిళనాడు కూడా దేశంలోనే భాగంగా ఉందని, అక్కడ లేని పన్ను భారం ఇక్కడెందుకని యువకుడు నాగబాబు.. వెల్లంపల్లిని నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న సమయంలో వెల్లంపల్లిపై ప్రతిపక్షాలు చేస్తోన్న అవినీతి ఆరోపణల గురించి కూడా నాగబాబు ప్రస్తావించారు. “మీరు రూ. 1500 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ వస్తోన్న విమర్శలకు ఏం బదులిస్తారు ?” అని యువకుడు మాజీ మంత్రిని ప్రశ్నించారు.

దీంతో ఆగ్రహంతో వెల్లంపల్లి.. “చెన్నైలో ఉండేవాడివి ఇక్కడ నీకేం సంబంధమయ్యా. అవినీతి గురించి మాట్లాడితే కేసు పెడతా. సీఐ గారు.. ఇలా రండి. నాపై చేస్తోన్న అవినీతి ఆరోపణలను నిరూపించకపోతే ఈ యువకుడిపై వెంటనే కేసు కట్టండి.” అంటూ స్థానిక సీఐకి హుకుం జారీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే నాగబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు టూ టౌన్ పోలీసు స్టేషన్​కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నేత పోతిన మహేశ్ స్టేషన్​కు వెళ్లి నాగబాబును విడిపించారు.