‘నిజం’ పేరుతో వర్మ కొత్త ఛానెల్ ప్రారభించబోతున్నారు..

సంచలన దర్శకులు , వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ..తాజాగా నిజం పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబోతున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనకున్న నిజానిజాలను తవ్వి తీయడమే తన ‘నిజం’ ఛానెల్ ముఖ్యోద్దేశం అని వర్మ ప్రకటించడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అవుతుంది.

‘నిజం’ ఛానెల్‌లో మొదటి ఎపిసోడ్‌గా ‘వివేకా హత్య వెనక నిజంలో అబద్ధముందా?’ అనే అంశం ప్రసారమవుతుందని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ‘వివేకా మర్డర్ వెనక నిజంలోని అబద్ధాలు, ఆ అబద్ధాలు చెప్పే వాళ్ల వెనక ఉన్న నిజాలు, ఆ నిజాల వెనక వేరే వాళ్లు ప్రభోధిస్తున్న అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్ల పైవాళ్లు బలవంతంగా అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజమైన అబద్ధాలు, వాటన్నింటి వెనుక అసలు నిజాలన్నింటినీ కూడా తవ్వి తీయడమే ‘నిజం’ ఛానెల్ ముఖ్య ఉద్దేశం’ అని వర్మ స్పష్టం చేశారు. ‘వివేకా హత్య వెనక నిజంలో అబద్ధముందా?’ అనే ఎపిసోడ్ ఈనెల 25న సాయంత్రం 4 గంటలకు ప్రసారమవుతుందని తెలిపారు.

వర్మ ప్రకటనపై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. వర్మ సినిమా మాదిరిగానే ‘నిజం’ యూట్యూబ్ ఛానెల్ అట్టర్ ఫ్లాప్ అవుతుందని , ‘నువ్వు చెప్పింది కరెక్టే.. తిన్న బిస్కెట్లకు నువ్వెంత మొరిగినా జనాలకు నిజమేంటో తెలుసు.. సిబిఐకి కూడా తెలుసు’ అని కామెంట్స్ చేస్తున్నారు.