ప్రధానికి అర్థంకాకుండా జగన్ రాష్ట్ర సమస్యలన్నీ తెలుగులో ప్రస్తావించారు – వర్ల రామయ్య
విశాఖ సభలో సీఎం జగన్ ప్రసంగం ఫై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేసారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీకి వచ్చిన ప్రధాని మోడీ.. రూ.10,742 కోట్లతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు ప్రధానిమోడీ , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ..విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలు పూర్తి చేయాలి అని ప్రధాని మోడీకి విశాఖ సభ వేదికలో విన్నవించారు.
కాగా జగన్ స్పీచ్ ఫై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ముఖ్యమంత్రి గారూ మీ తెలివి అమోఘం… ప్రధానమంత్రికి అర్థంకాకుండా రాష్ట్ర సమస్యలన్నీ తెలుగులో ప్రస్తావించారు. ఆయనను యథావిధిగా ప్రసన్నం చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు మాత్రం, సమస్యలన్నీ ఏకరవుపెట్టినట్టు బిల్డప్ ఇచ్చి తూతూ మంత్రంగా ఉభయతారకంగా మాట్లాడిన మీ శల్య సారథ్యం రాష్ట్రానికో వరం’ అంటూ వర్ల రామయ్య వ్యంగ్యం ప్రదర్శించారు.