ఖమ్మం లో ప్రమాదానికి గురైన వందే భారత్ రైలు

కేంద్ర సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైలు ..తరుచు వార్తల్లో నిలుస్తుంది. కొన్ని చోట్ల కొంతమంది ఆకతాయిలు రైలు ఫై రాళ్ల దాడి చేస్తే..మరికొన్ని చోట్ల రైళ్లకు గేదలు అడ్డువచ్చి..రైలు ముందు భాగాలు దెబ్బతింటుంటున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు పలు జరుగగా..తాజాగా ఖమ్మం జిల్లాలో అలాగే జరిగింది.ఈ రైలు ఓ ఎద్దును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం పాక్షికంగా దెబ్బతిన్నది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది.. రైలును ఘటనాస్థలంలోనే నిలిపివేసి మరమ్మతు చేపట్టారు.

శనివారం (మార్చి 11) మధ్యాహ్నం సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం బయల్దేరిన వందే భారత్ రైలు.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వే స్టేషన్‌ సమీపంలోకి రాగానే ట్రాక్ పైకి వచ్చిన ఎద్దును ఢీకొంది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం పాక్షికంగా దెబ్బతిన్నది. ఇక షెడ్యూల్ ప్రకారం ఈ రైలు రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకోవాల్సి ఉండగా.. ఈ ప్రమాదం కారణంగా సుమారు గంటన్నర ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కిందటి ఏడాది అక్టోబర్‌లో గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో వందే భారత్ రైలు.. గేదెలను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇంజిన్ ముందు భాగం ధ్వంసమైంది. రైలుకు అడ్డంగా వచ్చిన నాలుగు గేదెలు మృత్యువాతపడ్డాయి. ఆ మరుసటి రోజే ఆనంద్ స్టేషన్ సమీపంలో ఆవును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్ ముందు భాగం పాక్షికంగా ధ్వంసమైంది.