పురుషోత్తపట్నంలో భక్తులు చూస్తుండగానే గోదావరిలో కొట్టుకుపోయిన వనదుర్గ ఆలయం

పురుషోత్తపట్నం గోదావరి వరదలో 15 ఏళ్ల క్రితం నిర్మించిన వనదుర్గ ఆలయం కొట్టుకుపోయింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నంలో గోదావరి నది ఒడ్డున 15 ఏళ్ల క్రితం నిర్మించిన వనదుర్గ ఆలయం ఉంది. ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయి. నిన్న శుక్రవారం తొలి శ్రావణమాసం సందర్భాంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరికి వరద పోటెత్తడంతో ఆలయం వరకు నీరు చేరుకుంది.

వరద తాకిడికి తీరం కోతకు గురికావడంతో మధ్యాహ్నానికే ఆలయం బీటలు వారి ఓ వైపునకు ఒరిగిపోయింది. సాయంత్రానికి ఒక్కసారిగా నదిలో పడిపోయి కొట్టుకుపోయింది. ఆలయం కొట్టుకుపోవడం ఖాయమని ముందే గ్రహించిన గ్రామస్థులు గుడిలోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఆలయం నదిలో పడిపోతున్న సమయంలో గ్రామస్థులు వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో వైరల్ గా మారింది.