వైశాలి కిడ్నాప్ కేసు : ఎట్టకేలకు నవీన్ రెడ్డి ని పట్టుకున్న పోలీసులు

ఆదిభట్ల యువతీ వైశాలి కిడ్నాప్ లో నిందితుడు నవీన్ రెడ్డి ని పోలీసులు గోవా లో పట్టుకున్నారు. కిడ్నాప్ తర్వాత గోవాకు పారిపోయిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నవీన్ రెడ్డితోపాటు ఏ-6 ఉన్న చందుని కూడా అరెస్ట్ చేశారు. అనంతరం కిడ్నాప్ తర్వాత నిందితులు ఎక్కడికి వెళ్లారు..? పరారీలో ఉన్న మిగతా నిందితుల వివరాలపై ఆరా తీస్తున్నారు.

ఆదిభట్ల యువతీ కిడ్నాప్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రాగన్నగూడకు చెందిన వైశాలి ని గత కొద్దీ రోజులుగా నవీన్ రెడ్డి అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో వైశాలి ఇంట్లో పెండ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం వైశాలి కి పెండ్లి చూపులు ఏర్పాటు చేయగా..ఇది తెలుసుకున్న నవీన్‌ రెడ్డి అనే యువకుడు వందమంది యువకులతో కలిసి సదరు యువతి ఇంటికి వచ్చి దాడి చేశాడు. అనంతరం యువతిని బలవంతంగా లాక్కెళ్లారు. ఆ తర్వాత పోలీసులు వైశాలిని క్షేమంగా ఇంటికి చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలు కు తరలించగా..ప్రధాన నిందితుడు నవీన్ ను గోవా లో అరెస్ట్ చేశారు.

వైశాలి కిడ్నాప్‌ కేసులో సంచలన విషయాలు బయటికొచ్చాయి. పరిచయం దగ్గర్నుంచి కిడ్నాప్‌ వరకు ప్రతీ ఇన్సిడెంట్‌నీ సీన్‌ టు సీన్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో ప్రస్తావించారు పోలీసులు. వైశాలికి, నవీన్‌రెడ్డికి అసలెలా పరిచయం?. కిడ్నాప్‌కి దారితీసిన పరిణామాలన్నీ క్లియర్‌గా కోర్టుకు నివేదించారు. నవీన్ రెడ్డిని పోలీసులు గోవా నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు.