ఉసేన్ బోల్డ్ కు కరోనా పాజిటివ్
పార్టీలో క్రిస్ గేల్ సహా పలువురు సెలబ్రిటీలు!
కింగ్స్టన్: ఒలింపిక్స్లో ఎనిమిది బంగారు పతకాలు సాధించిన జమైకా దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కోవిడ్ పాజిటివ్ రావడంతో ఉసేన్ బోల్ట్ సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
‘ గుడ్ మార్నింగ్… నాకు కోవిడ్19 పాజిటివ్ వచ్చింది. శనివారం నాడు పరీక్షలు చేయించుకోగా, ఖరారైంది. దీంతో నేను బాధ్యతగా ఉండాలని అనుకుంటున్నాను. అందుకే నా సన్నిహితులకు దూరంగా ఉంటున్నాను. ప్రస్తుతం ఎలాంటి లక్షణాలూ లేవు. హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను. కరోనా ప్రొటోకాల్ గురించి హెల్త్ మినిస్ట్రీ నుంచి కొన్ని వివరాలను కోరాలని భావిస్తున్నాను. నా దేశ ప్రజలంతా క్షేమంగా ఉండాలి’ అని అన్నారు. ఆగస్టు 21న ఉసేన్ బోల్ట్ తన 34వ పుట్టిన రోజును ఎంతో అట్టహాసంగా జరుపుకున్నారు. అయితే ఈ పార్టీకి పలువురిని ఉసేన్ బోల్ట్ కలిశారు. నాడు ఏర్పాటు చేసిన పార్టీలో భౌతిక దూరం కనిపించకపోగా, కనీసం మాస్క్ లను కూడా ఎవరూ ధరించలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఆ పార్టీకి హాజరైన వారందరిలోనూ ఆందోళన నెలకొంది. 21న బోల్ట్ ను కలిసిన వారిలో పలువురు ఇప్పటికే సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. నాడు ప్రముఖ క్రికెటర్ క్రిస్ గేల్, మాంచెస్టర్ సిటీ స్టార్ స్టెర్లింగ్ లతో పాటు బేయర్ లెవెర్కుసేన్, అటాకర్ లియాన్ బెయిలీ తదితరులు కూడా పార్టీకి వెళ్లడం గమనార్హం.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/