భారత ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడి ఆహ్వానం

బైడెన్ ఆహ్వానాన్ని మోడీ మన్నించారన్న పీఎంవో

usa-president-jo-biden-invites-modi-to-visit-america

న్యూఢిల్లీః అమెరికాలో పర్యటించాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం అందిందని ప్రధాన మంత్రి కార్యాలయం బుధవారం వెల్లడించింది. ఈమేరకు ప్రధాని మోడీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానించారని పేర్కొంది. ఈ ఆహ్వానాన్ని ప్రధాని మోడీ మన్నించారని, త్వరలోనే ఆ దేశంలో పర్యటిస్తారని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జి 20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు బైడెన్ భారత్ కు రానున్నారు.

అదేవిధంగా జూన్, జులై నెలల్లో అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ సెషన్ లు జరగనున్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మోదీ పర్యటనకు అనుకూలమైన షెడ్యూల్ ను రూపొందిస్తామని పీఎంవో వివరించింది. ప్రధాని మోడీ 2021 లోనూ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో వాషింగ్టన్ లో బైడెన్, మోడీల మధ్య తొలి ద్వైపాక్షిక సమావేశం జరిగింది. తాజా ఆహ్వానం మేరకు ఈ ఏడాది మరోమారు మోడీ అమెరికాలో పర్యటిస్తారు.

ఈ పర్యటనలో అమెరికా కాంగ్రెస్ లో ప్రధాని మోడీ ప్రసంగిస్తారని సమాచారం. మోడీ గౌరవార్థం అమెరికా అధ్యక్ష భవనంలో బైడెన్ విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా, గతేడాది బాలిలో జరిగిన జి 20 సదస్సులో ఇరువురు నేతలు కలుసుకున్నారు.