ప్రపంచ దేశాల కోసం అమెరికా కీలక నిర్ణయం!
50 కోట్ల ఫైజర్ వ్యాక్సిన్లు కొని ప్రపంచ దేశాలకు ఇవ్వనున్న అమెరికా
వాషింగ్టన్: కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ దేశాలను రక్షించేందుకు తాజాగా అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 కోట్ల ఫైజర్-బయోఎన్టెక్ కరోనా వ్యాక్సిన్లను కొనుగోలు చేయనున్నట్లు బుధవారం వెల్లడించింది. వచ్చే ఏడాది కాలంలోనే 50 కోట్ల టీకా డోసులు ప్రపంచంలోని 92 పేద దేశాలతోపాటు ఆఫ్రికా దేశాలకు సరఫరా చేస్తామని పేర్కొంది. జీ7 దేశాల సదస్సుకు ముందు గురువారం ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేయనున్నారని వైట్హౌస్ వర్గాలు తెలిపాయి.
2021లో 10 కోట్ల మంది కోసం 20 కోట్ల డోసులు సరఫరా చేయనుండగా.. వచ్చే ఏడాదిలో మిగిలిన 30 కోట్ల డోసులు అందించనున్నట్లు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ మాట్లాడుతూ, ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయటంలో ప్రజాస్వామ్య దేశాలే ముందుంటాయని అన్నారు. మహమ్మారిని తుదముట్టించే ఆయుధసామాగ్రి (టీకాలు) అగ్రరాజ్యం వద్దే ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక కరోనాతో పోరులో భాగంగా ప్రపంచదేశాలకు వ్యాక్సిన్ల సరఫరాలో అమెరికా వెనుకాడుగు వేయబోదని సులివాన్ తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/