పాఠశాలలో కాల్పులు.. ముగ్గురు విద్యార్థుల మృతి

పోలీసుల అదుపులో 15 ఏళ్ల కుర్రాడు

మిచిగాన్ : అమెరికాలో తుపాకి మరోమారు గర్జించింది. ఓ స్కూల్‌లోకి చొరబడిన దుండగుడు యథేచ్ఛగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు మరణించారు. వీరిలో 16 ఏళ్ల బాలుడు, 14, 17 సంవత్సరాల వయసున్న ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మరో 8 మంది గాయపడ్డారు. మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్‌‌కు 48 కిలోమీటర్ల దూరంలోని ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్న హైస్కూల్‌లో నిన్న మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.

దుండగుడి కాల్పుల్లో గాయపడిన వారిలో ఓ టీచర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పాఠశాలకు చేరుకున్న పోలీసులు అనుమానితుడైన 15 ఏళ్ల కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఓ సెమీ ఆటోమెటిక్ హ్యాండ్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 15 నుంచి 20 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/