చైనాపై ఒత్తికి అమెరికా కీలక నిర్ణయం
భారత్తో సైనికపరమైన సంబంధాల్ని బలోపేతం చేయనున్న అమెరికా
అమెరికా: కరోనా మహమ్మారి చైనాల్యాబ్లోనే తయారు చేసిందని అమెరికా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చైనాపై ఆంక్షల విధింపునకు సెనేట్లో బిల్లు కూడా ప్రవేశపెట్టింది. కరోనా విపత్తుకు చైనాయే బాధ్యత వహించేలా ఒత్తిడి పెంచేందుకు మరిన్ని చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా భారత్తో సైనికపరమైన సంబంధాల్ని బలోపేతం చేసుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా, 18 అంశాలతో కూడిన ఓ కార్యాచరణను అమెరికా రూపొందించింది. తమ మిత్రపక్షాలతో సైనిక బంధాన్ని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే భారత్తో పాటు తైవాన్, వియత్నాం వంటి దేశాలకు ఆయుధాల విక్రయాన్ని విస్తరించాలని నిర్ణయించింది.
‘పసిఫిక్ డిటెరెన్స్ ఇనిషియేటివ్’ను ప్రారంభించాలని, 20 బిలియన్ డాలర్ల నిధుల సైనిక విభాగం ఏర్పాటు ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం తెలపాలని యోచిస్తోంది. అలాగే, జపాన్ సైనిక వ్యవస్థ పునర్నిర్మాణానికి ప్రోత్సాహం అందించాలని, దక్షిణ కొరియాతో పాటు జపాన్కు ఆయుధాలు విక్రయించాలని నిర్ణయించింది. చైనాలోని అమెరికా ఉత్పత్తి సంస్థలను తిరిగి స్వదేశానికి రప్పించాలని, దీని ద్వారా సరఫరా గొలుసులో చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని ప్రణాళిక వేసుకుంది. తమ సాంకేతికతను చైనా చోరీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/