చైనా యాప్‌లపై అమెరికా నిషేధం!

తామూ బ్యాన్‌ అంశంపై పరిశీలిస్తున్నామన్న పాంపియో

Mike Pompeo
Mike Pompeo

వాషింగ్టన్‌: చైనాకు చెందిన యాప్‌ల‌ను బ్యాన్ చేయాల‌ని అమెరికా భావిస్తుంది. ఈమేరకు చైనా యాప్‌ల‌ను నిషేధించాల‌ని భావిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో తెలిపారు. టిక్‌టాక్‌తో స‌హా అన్ని ర‌కాల యాప్‌ల‌ను బ్యాన్ చేయాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు మైక్ పాంపియో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్‌లను నిషేధించే అంశాన్ని తమ దేశం పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. మ‌రోవైపు టిక్‌టాక్ యాప్ త‌న ఆప‌రేష‌న్స్‌ను హాంగ్‌కాంగ్‌లో ఆపేసింది. ఇటీవ‌లో హాంగ్‌కాంగ్‌పై భ‌ద్ర‌తా చ‌ట్టం త‌యారు చేసిన చైనా అక్క‌డ‌ అనేక ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్న‌ది. అయితే హాంగ్‌కాంగ్‌లో త‌మ యాప్ ఆప‌రేష‌న్స్‌ను నిలిపివేస్తున్న‌ట్లు టిక్‌టాక్ తెలిపింది.
కాగా చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన 59 యాప్‌లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇటీవలే అమెరికా ప్రశంసించింది. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలకు ఈ చర్య దోహదపడుతుందని మైక్ పాంపియో వ్యాఖ్యానించారు. అమెరికాలోనూ టిక్ టాక్‌ను నిషేధించాలని తమ ప్రభుత్వానికి ఇటీవల జాతీయ భద్రతా సలహాదారులు సిఫార్సు చేశారు. ఇటువంటి యాప్‌ల ద్వారా చైనా ప్రభుత్వం అమెరికా పౌరుల డేటాను తస్కరిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా ఆ దిశగా చర్యలు తీసుకోవాలనుకుంటోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/