అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కు కరోనా

రెండు వ్యాక్సిన్ డోసులు, ఒక బూస్టర్ డోస్ వేయించుకున్న రక్షణ మంత్రి

వాషింగ్టన్: అమెరికాను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. అక్కడ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా యూఎస్ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ చీఫ్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆస్టిన్ కరోనా బారిన పడ్డారని… ఆయనలో కోవిడ్ స్వల్ప లక్షణాలు కనిపించాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజుల పాటు ఆయన ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంటారని తెలిపారు.

మరోవైపు ఆస్టిన్ మాట్లాడుతూ, తాను రెండు డోసుల వ్యాక్సిన్ తో పాటు బూస్టర్ డోసును కూడా వేసుకున్నానని… అందుకే కరోనా స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని చెప్పారు. కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ బాగా పని చేస్తోందని… ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు వేయించుకోవాలని కోరారు. ప్రెసిడెంట్ జో బైడెన్ ను డిసెంబర్ 21న తాను చివరిసారిగా కలిశానని ఆస్టిన్ చెప్పారు. అన్ని కీలక సమావేశాలకు, చర్చలకు తాను వర్చువల్ గా హాజరవుతానని తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/