మయన్మార్‌లో ప్రజల నిరసనలు..స్పందించిన అమెరికా

సైనికుల చ‌ర్య‌ల‌ను ఆపాల‌ని అమెరికా సూచ‌న‌

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడంపై స్పందించింది. శాంతియుతంగా నిర‌స‌న‌లు తెలుపుతూ, మ‌య‌న్మార్‌లో మ‌ళ్లీ ప్రజాస్వామ్య పాలన కోసం పోరాడుతున్న ప్రజలకు మ‌ద్దతు ఇస్తున్న‌ట్లు తెలిపింది. సైనికులు ప్ర‌జ‌ల‌పై పాల్ప‌డుతున్న చ‌ర్య‌ల‌ను ఆపాల‌ని చెప్పింది. ఈ మేర‌కు ఆ దేశ‌ మిలిటరీ పాలకులకు విజ్ఞప్తి చేస్తున్న‌ట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్‌ ప్రైజ్ తెలిపారు.

అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధించిన జర్నలిస్టులను, ఉద్య‌మ‌కారుల‌‌ను విడుదల చేయాల‌ని చెప్పారు‌. ప్రజల మనోభావాలను సైన్యం గౌరవించాలని అన్నారు. కాగా, మ‌యన్మార్‌ నేత ఆంగ్‌ సాన్‌ సూకీ ఫిబ్రవరి 1 నుంచి నిర్బంధంలో ఉన్నారు. సూకీని విడుద‌ల చేయాల‌ని ప్ర‌జ‌లు నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. రెండు రోజుల క్రితం మాండలే నగరంలో నిరసనలు చేస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరిపి, ముగ్గురి ప్రాణాలు తీయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ దాడిలో దాదాపు 150 మంది గాయప‌డ్డారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/