ఎన్నికల్లో రెండు సార్లు ఓటేయండి..ట్రంప్
ఓటర్లను కోరిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కోసం అధ్యక్షుడు ట్రంప్ నార్త్ కరోలినాలో ప్రచారం కోసం వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు రెండు సార్లు ఓటేసేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. కరోనా నేపథ్యంలో మెయిల్ ఓటింగ్ నిర్వహించనున్నారు. దీన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. మెయిల్ ఓటింగ్ ద్వారా డెమోక్రటిక్ పార్టీ రిగ్గింగ్కు పాల్పడే అవకాశం ఉన్నట్లు ట్రంప్ ఆరోపిస్తున్నారు. అందుకే నార్త్ కరోలినా ప్రజలు రెండు సార్లు ఓటు వేయాలన్నారు. తొలుత మెయిల్ ద్వారా ఓటు వేయడం.. ఆ తర్వాత పోలింగ్ బూత్లో బ్యాలెట్ ఓటును కూడా వినియోగించుకోవాలన్నారు. ఈ పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తే, అక్రమాలు జరగవన్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో రెండు సార్లు ఓటు హక్కును వినియోగించుకోవడం నేరం. ఆ దేశ ఎన్నికల సంఘం కూడా ఇదే చెబుతున్నది. రెండుసార్లు ఓటు వేయాలని ట్రంప్ కామెంట్ చేయగానే.. నార్త్ కరోలినా ఎన్నికల బోర్డు ప్రకటన జారీ చేసింది. రెండు సార్లు ఓటు వేయడం చట్టవ్యతిరేకమన్నది. ఫెడరల్ చట్టానికి విరుద్ధమని ఎన్నికల సంఘం పేర్కొన్నది. ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేసి నేరానికి పాల్పడినట్లు ఎన్నికల అధికారులు ఆరోపిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించాలని అధ్యక్షుడు రెచ్చగొట్టడం సరికాదు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/