హత్రాస్ బాధితురాలి అంత్యక్రియలపై సుప్రీంకు యూపీ ప్రభుత్వం వివరణ
ఇటివల హత్రాస్ లో దళిత యువతిపై పైశాచిక దాడి
న్యూఢిల్లీ: హత్రాస్ ఘటనలో బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించడానికి గల కారణాలను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వివరించింది. హత్రాస్ లో దాడికి గురైన 19 ఏళ్ల అమ్మాయి ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబరు 29న మృతి చెందింది. అయితే, ఆమె చికిత్స పొందిన సఫ్దర్ జంగ్ ఆసుపత్రి వద్ద జరిగిన ధర్నా తరహాలోనే మరిన్ని అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి తమకు సమాచారం అందిందని యూపీ సర్కారు సుప్రీంకు తెలిపింది.
ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం… ఈ వ్యవహారానికి కులం, మతం అంశాలను ఆపాదించి కొన్ని స్వార్థపూరిత శక్తులు లాభపడేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసిందని, ఇలాంటి విపరిణామాలు చోటుచేసుకోకుండా ఉండేందుకే తాము ఆ యువతి మృతదేహానికి అత్యవసరంగా అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందని వివరించింది. యువతి మరణించిన మరుసటిరోజు భారీ స్థాయిలో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని తెలియడంతో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని యూపీ సర్కారు స్పష్టం చేసింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/