అఫిడవిట్లో త‌న ఆస్తుల వివ‌రాలు తెలిపిన యూపీ సీఎం

మొత్తం కోటి 54 లక్షల 94 వేల రూపాయల విలువైన ఆస్తులు

లక్నో: యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ ఎన్నికల అఫిడవిట్లో త‌న ఆస్తుల వివ‌రాలు వెల్లడించారు. తనకు మొత్తం ఒక కోటి 54 లక్షల 94 వేల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే, రూ.12 వేలు విలువ కలిగిన ఓ శాంసంగ్‌ మొబైల్‌ ఫోన్‌, రూ. లక్ష విలువ ఉండే రివాల్వర్‌, రూ.80 విలువ కలిగిన మరో రైఫిల్‌ ఉన్నట్లు ఆయన తెలిపారు. రూ.49 వేల విలువ ఉండే బంగారు చెవి రింగు, రూ.20 వేల రుద్రాక్షహారం తన వద్ద ఉన్నట్లు యోగి వెల్ల‌డించారు. తనకు ఎటువంటి వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు లేవని పేర్కొన్నారు. త‌న‌కు సొంత వాహనం కూడా లేదని పేర్కొన్నారు. అలాగే, బ్యాంకుల్లో ఎటువంటి రుణాలూ లేవని, త‌న‌పై పెండింగ్‌లో ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని తెలిపారు.

కాగా, గ‌తంలో లోక్‌సభ స‌భ్యుడిగా ఆయ‌న‌ ఐదుసార్లు ఎన్నికైన విష‌యం తెలిసిందే. తొలిసారి అసెంబ్లీ స్థానం నుంచి ఆయ‌న‌ పోటీ చేస్తున్నారు. గోరఖ్‌పుర్‌ శాసనసభ స్థానం నుంచి ఆయ‌న నామినేష‌న్ వేశారు. ఇదిలా ఉండ‌గా, స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ తనకు 17.22 కోట్ల రూపాయ‌ల‌ విలువైన ఆస్తులు ఉన్నట్లు ఇటీవల ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/