యూపీ బీజేపీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష

నకిలీ మార్క్ లిస్ట్ ఉపయోగించి పై తరగతిలో ప్రవేశం

లక్నో : కళాశాలలో అడ్మిషన్ కోసం నకిలీ మార్క్స్ లిస్ట్ సమర్పించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఇంద్రప్రతాప్ తివారిని కోర్టు దోషిగా తేల్చింది. అయోధ్యలోని గోసాయ్‌గంజ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తివారి గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్‌లో ఫెయిలయ్యారు. అయినప్పటికీ 1990లో నకిలీ మార్క్స్ లిస్ట్ సమర్పించి పై తరగతిలో ప్రవేశం పొందారు.

తివారి సమర్పించింది నకిలీ మార్క్ షీట్ అని గుర్తించిన కాలేజీ ప్రిన్సిపాల్ 1992లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 28 ఏళ్ల సుదీర్ఘకాలంపాటు సాగిన ఈ కేసులో నిన్న ఆయనకు శిక్ష పడింది. విచారించిన ప్రత్యేక న్యాయస్థానం ఇంద్రప్రతాప్‌ను దోషిగా తేల్చింది. ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 8 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/