దేశంలోని ముఖ్యమైన రాష్ట్రాల్లో ఏపీ ఒకటిః కేంద్రమంత్రి గడ్కరీ

రాష్ట్రంలో రోడ్ల కనెక్టివిటీకి రూ.20 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటన

union-minister-nitin-gadkari-said-union-govt-will-assist-ap-by-all-the-way

విశాఖః ఏపీ ప్రభుత్వం విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్-2023)కు కేంద్రమంతి నితిన్ గడ్కరీ కూడా హాజరయ్యారు. ఈ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, దేశంలోని ముఖ్యమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని వెల్లడించారు. ఏపీలో జాతీయ రహదారులను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో రోడ్ల అనుసంధానం కోసం రూ.20 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. పోర్టులతో రహదారుల కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తామని, పారిశ్రామిక అభివృద్ధిలో రహదారుల కనెక్టివిటీ ఎంతో ముఖ్యమైన అంశం అని గడ్కరీ స్పష్టం చేశారు. మోదీ పాలనలో రోడ్ల అభివృద్ధి వేగం పుంజుకుందని అన్నారు.

తిరుపతిలో ఇంట్రా మోడల్ బస్ పోర్టు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఏపీలో 3 పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయని వివరించారు. సరకు రవాణా ఖర్చులు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు గడ్కరీ తెలిపారు. పరిశ్రమలకు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఏపీలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వంతో సమాన భాగస్వామ్యంతో లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు ఉంటుందని వివరించారు.