ఈటలను జైలుకు పంపే కుట్ర జరుగుతోంది

కేసీఆర్ జాగ్రత్త.. ఈటల వెనక మోడీ ఉన్నారు..హెచ్చరించిన కిషన్‌రెడ్డి

హైదరాబాద్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ వెనక ప్రధాని మోడీ ఉన్నారని అన్నారు. ఈటలను ఏదో రకంగా జైలుకు పంపే కుట్ర జరుగుతోందన్నారు. ఆయన వెనక మోడీ ఉన్నారని, ఈటలను వేధిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ కిషన్ ‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలను రెచ్చగొట్టడం కేసీఆర్ కు అలవాటని, ఆ తర్వాత అన్నీ మర్చిపోతారని కిషన్‌రెడ్డి అన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదంపై మాట్లాడుతూ.. ఆస్తులు పంచుకోవడంతోపాటు పార్టీలు చేసుకున్న కేసీఆర్, జగన్‌లు జలవివాదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. సీఎంల మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందో కానీ ఏపీ ప్రజలను రాక్షసులుగా, ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. హుజూరాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉందన్న కేంద్రమంత్రి కాంగ్రెస్ నిన్నటి పార్టీ అని, దానికి భవిష్యత్ లేదని తేల్చి చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/