పెను ప్రమాదం నుండి బయటపడ్డ కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్
కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. ఆగ్రాలో అంబేద్కర్ జయంతి వేడుకలకు కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ హాజరయ్యారు. ఈ క్రమంలో వేడుక కోసం ఏర్పాటు చేసిన వేదిక కూలిపోవడంతో పలువురు గాయపడ్డారు. వేదిక కూలిన సమయంలో అక్కడే ఉన్న కేంద్రమంత్రిపై వేదికపై ఏర్పాటు చేసిన లైట్లతో పాటు పలువురు వ్యక్తులు మీదపడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు నేతలు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రికి తృటిలో ప్రమాదం తప్పింది. స్ధానిక పోలీసులు, భద్రతా సిబ్బంది కిందపడిన ఆయనను పైకిలేపారు. ఆయనకు గాయాలేవీ కాకపోవడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సన్మాన కార్యక్రమాలు, వేడుకల్లో వేదికలు కూలుతున్న ఘటనలు సాధారణమయ్యాయని హిందుస్ధానీ బిరదారి వైస్ చైర్మన్ విశాల్ శర్మ పేర్కొన్నారు. వీవీఐపీల పర్యటన సందర్భంగా వేదికలపై ఎక్కువ మందిని అనుమతించకుండా నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.