కొత్త పథకం తీసుకువచ్చిన కేంద్రం

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి ఆదుకునేవారికి రూ.5 వేలు… కేంద్రం ప్రకటన

న్యూఢిల్లీ : రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సకాలంలో వైద్య చికిత్స అందించగలిగితే వారి ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుంది. అందుకే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు తొలి గంట కీలకం అని చెబుతారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను ఆదుకునేవారికి రూ.5 వేలు పారితోషికంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పథకాన్ని ప్రారంభించినట్టు కేంద్రం వెల్లడించింది. తొలి గంటలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడేవారికి నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తామని తెలిపింది. ఈ పథకం అక్టోబరు 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఇందులో భాగంగా జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాణదాతలుగా నిలిచిన 10 మందికి రూ.1 లక్ష చొప్పున అందిస్తారు.

ఈ పథకంలో భాగంగా…. ప్రమాదం గురించి పోలీసులకు మొట్టమొదట ఎవరైనా సమాచారం అందిస్తే, ఆ వివరాలను వైద్యులతో ధ్రువీకరించుకున్న అనంతరం పోలీసులు ఆ వ్యక్తికి ఓ రసీదు ఇస్తారు. ఆ రసీదు కాపీని జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పనిచేసే ఓ కమిటీకి పోలీసులే పంపిస్తారు. అలాకాకుండా, రోడ్డు ప్రమాద బాధితులను ఎవరైనా నేరుగా ఆసుపత్రికి తరలిస్తే, వారి పూర్తి వివరాలను ఆసుపత్రి వారే పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్రం తాజా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/