కరోనా ప్రభావం దశాబ్దల పాటు ఉంటుంది
తగ్గుముఖం పట్టిందని భావిస్తోన్న దేశాల్లో మరోసారి విజృంభణ
జెనీవా: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి ఆరు నెలల పూర్తయిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అత్యవసర విభాగం మరోసారి సమావేశమైంది. ఈక్రమంలోనే కరోనా విజృంభణపై డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ మాట్లాడుతూ.. పలు విషయాలు తెలిపారు. కొవిడ్19 ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చైనాలో కరోనా వ్యాప్తి గురించి ప్రపంచానికి తెలిసి 6 నెలలు గడిచిన సందర్భంగా అత్యవసర విభాగం సమావేశమై కరోనాపై చర్చించింది.
చైనా వెలుపల 100 కేసులు, మరణాలే లేని సమయంలో ప్రపంచ ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించాల్సి వచ్చిందని అధానోమ్ చెప్పారు. ఇలాంటి వైరస్లు 100 ఏళ్లలో ఒకసారి వెలుగుచూస్తాయన్నారు. వాటి ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగుతుందని వివరించారు. కరోనా విషయంలో శాస్త్ర సంబంధమైన ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించిందని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికీ ఎన్నో వాటికి సమాధానం దొరకాల్సి ఉందని చెప్పారు. చాలా మందికి వైరస్ ముప్పు ఇప్పటికీ పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ సోకి తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లోనూ మరోసారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అధ్యయనాల్లో తేలిందని వివరించారు.
వైరస్ తగ్గుముఖం పట్టిందని భావిస్తోన్న దేశాల్లో మరోసారి విజృంభిస్తోందని తెలిపారు. మొదట కరోనా పెద్దగా ప్రభావానికి గురికాని దేశాలు కూడా ఇప్పుడు ఆ సంక్షోభంలో చిక్కుకున్నాయని చెప్పారు. పలు దేశాలు వైరస్ను బాగా కట్టడి చేయగలిగాయని తెలిపారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/