వలస కార్మికుల దుస్థితి కేంద్రానికి పట్టడం లేదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రంలోని ప్రధాని మోడి ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు. లాక్డౌన్ కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల దుస్థితి కేంద్రానికి ఏమాత్రం పట్టడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. దేశంలోని ప్రతి పేద కుటుంబానికి వచ్చే ఆరు నెలల పాటు 7,500 రూపాయల చొప్పున నగదును కేంద్రం ఉదారంగా అందించాలని ఆమె డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ గురువారం నుంచి దేశ వ్యాప్తంగా పేదలు, కార్మికులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దురవస్థపై గొంతెత్తే క్రమంలో భాగంగా ఓ క్యాంపేయిన్ను చేపట్టింది. అందులో భాగంగా సోనియా గాంధీ పై కామెంట్లు చేశారు. దేశంలో కరోనా వ్యాప్తి సోకడంతో కేంద్రం లాక్డౌన్ విధించిందని, దీంతో రెండు నెలలుగా దేశ ఆర్థిక వ్యవస్థ ఊబిలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికులు పాదాలకు ఎలాంటి రక్షణా లేకుండా, పాద రక్షలు లేకుండా వందల కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోతున్నారు. వలస కార్మికులు, పేద ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఇంతటి వ్యధ అనుభవించడం ఇదే ప్రథమం. వలస కార్మికుల దీనావస్థ, దుస్థితి దేశం మొత్తం గ్రహించింది. కానీ కేంద్రం మాత్రం గ్రహించడం లేదు.గగ అని సోనియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/