ఖర్కివ్‌లో శవాల దిబ్బలు..ఓ గొయ్యిలో 440కిపైగా మృతదేహాలు

ఓ ప్రాంతంలో 17 మంది ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలు

Ukrainian president: Mass grave found near recaptured city

కీవ్ః ఉక్రెయిన్‌ పై రష్యా దాడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రష్యా సేనల అధీనంలో ఉన్న దేశంలోని రెండో అతిపెద్ద పట్టణమైన ఖర్కివ్‌ను ఉక్రెయిన్ దళాలు మళ్లీ స్వాధీనం చేసుకున్నాయి. ఈ సందర్భంగా నగరాన్ని పరిశీలించగా ఇజియం ప్రాంతంలో శవాల దిబ్బలు కనిపించాయి. ఇక్కడి శివారు అటవీ ప్రాంతంలోని ఓ గొయ్యిలో 440కి పైగా మృతదేహాలు బయటపడ్డాయి. సీనియర్ దర్యాప్తు అధికారి ఒకరు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. మృతుల్లో చాలామంది తుపాకి తూటాలకు బలికాగా, మరికొందరు క్షిపణులు, వైమానిక దాడుల కారణంగా మరణించి ఉంటారని ఆయన పేర్కొన్నారు. చంపడానికి ముందు వారిని హింసించిన గుర్తులు కూడా ఉన్నాయని అన్నారు.

అలాగే, అదే ప్రాంతంలో ఒక చోట 17 మంది ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలు కూడా ఉన్నట్టు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది. వీరిని పూడ్చిన ప్రాంతం చుట్టూ వందలాది చిన్నచిన్న సమాధులు ఉన్నట్టు ఆ కథనం పేర్కొంది. ఖర్కివ్ తిరిగి ఉక్రెయిన్ చేతుల్లోకి వచ్చిన తర్వాత అధ్యక్షుడు జెలెన్ స్కీ సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. రష్యా ప్రతి చోటా మరణశాసనం రాసిందన్నారు. అప్పట్లో బుచా, మేరియుపోల్ తర్వాత ఇప్పుడు ఖర్కివ్ అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి రష్యానే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/