మన ప్రజలు, మన ఖేర్సన్.. ఖేర్సన్ నగరం ఇక మాదే: జెలెన్స్కీ
కివ్: రష్యా దళాలు ఉక్రెయిన్లోని ఖేర్సన్ నగరాన్ని వీడుతున్నాయి. ఖేర్సన్ దాని పరిసర ప్రాంతాల నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్లు రష్యా శుక్రవారం ప్రకటించింది. నిప్రో నది పశ్చిమ తీరం నుంచి బలగాలను పూర్తిగా వెనక్కు తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. సిబ్బందితోపాటు ఆయుధ సామగ్రిని నిప్రో నది తూర్పు తీరంవైపు తరలించినట్లు పేర్కొంది. ఈ క్రమంలో ఖేర్సన్ నగరం క్రమంగా తమ నియంత్రణలోకి వస్తున్నట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. సైన్యం ఇప్పటికే నగరంలోకి ప్రవేశించిందని తెలిపింది. ఈ పరిణామాన్ని ‘కీలక విజయంగా’ అభివర్ణించింది.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ్ సైతం ‘ఖేర్సన్ నగరం ఇక మాదే’ అంటూ ప్రకటించారు. ‘మన ప్రజలు, మన ఖేర్సన్’ అంటూ టెలిగ్రామ్లో రాసుకొచ్చారు. ప్రస్తుతానికి ఉక్రెయిన్ బలగాలు నగర శివార్లలో ఉన్నాయని, ప్రత్యేక విభాగాలు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయని తెలిపారు. రష్యా సేనలు పేలుడు పదార్థాలను వదిలిపెట్టాయన్న అనుమానంతో వాటిని తొలగించేందుకు సంబంధిత నిపుణులు రంగంలోకి దిగినట్లు చెప్పారు. తాజాగా ఖేర్సన్ పరిసరాల్లో ప్రజల సందడి, నగర వ్యాప్తంగా ఉక్రెయిన్ జెండాలు వెలసిన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/movies/