తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్‌ భుయాన్‌ నియామకం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్​ నియామకమయ్యారు. తెలంగాణ హైకోర్టుకు ఇప్పటిదాకా ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన సతీష్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తెలంగాణ హైకోర్టుకు నూతన సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ను నియమానిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. హైకోర్టు సీజేగా నియామకమైన ఉజ్జల్‌ భుయాన్‌ ప్రస్తుతం తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలోనే సేవలందిస్తున్నారు.

సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు మేరకు జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ సీజేగా పదోన్నతి లభించింది. జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ 1964, ఆగస్ట్‌ 2న గువాహటిలో జన్మించారు. గువాహటిలోని డాన్‌బాస్కో పాఠశాలలో విద్యనభ్యసించారు. స్థానిక ప్రభుత్వ న్యాయకళాశాల నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. ఆయన గువాహటి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. 2010లో గువాహటి హైకోర్టు సీనియర్‌ న్యాయవాదిగా చేరారు. 2011లో అసోం అదనపు ఏజీగా, అదే సంవత్సరం అక్టోబర్‌లో గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. 2019లో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. 2021 అక్టోబర్‌ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు.