ఆక‌స్‌లో భారత్, జ‌పాన్‌ ఉండ‌వు: అమెరికా

అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిట‌న్ దేశాల‌తో ఆక‌స్‌ గ్రూపు ఏర్పాటు

వాషింగ్ట‌న్‌: చైనా దుందుడుకు చ‌ర్య‌ల‌ను అడ్డుకునేందుకు అమెరికా, బ్రిట‌న్‌, ఆస్ట్రేలియా దేశాలు ఏర్పాటు చేసిన‌ ఆక‌స్ గ్రూపులో భార‌త్‌, జ‌పాన్ లేవ‌ని అమెరికా గుర్తు చేసింది. ఇండో-ప‌సిఫిక్ ప్రాంతంలో ఆక‌స్ గ్రూపు ప‌ని చేయ‌నుంది. ఇందులో భాగంగా బ్రిట‌న్ త‌న వ‌ద్ద ఉన్న అణ్వాయుధ జ‌లాంత‌ర్గాముల సాంకేతిక‌త‌ను ఆస్ట్రేలియాకు ఇవ్వ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఆసియాలోని కీల‌క దేశాలైన భార‌త్, జ‌పాన్‌ల‌ను కూడా ఈ గ్రూపులో చేర్చే అవ‌కాశం ఉంద‌ని వ‌స్తోన్న ప్రచారంపై వైట్‌హౌజ్ ప్రెస్ సెక్ర‌ట‌రీ జెన్ సాకి మీడియా స‌మావేశం స్పందిస్తూ ఆ ప్ర‌చారాన్ని కొట్టిపారేశారు.

ఈ నెల‌15న ఆక‌స్ గ్రూపును అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ప్ర‌క‌టించారని చెప్పారు. ఇందేలో మ‌రే దేశాన్నీ చేర్చుకోవ‌డం లేద‌ని ఫ్రాన్స్‌కు కూడా బైడెన్ స్ప‌ష్టంచేశార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం భార‌త ప్ర‌ధాని మోదీ అమెరికాలో ప‌ర్య‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. భార‌త్, అమెరికా, జ‌పాన్‌, ఆస్ట్రేలియా దేశాల చ‌తుర్భుజ కూట‌మి చ‌ర్చ‌ల్లో పాల్గొన‌నుంది. మిగ‌తా దేశాల అధినేత‌లూ అమెరికా వెళ్తున్నారు. ఈ స‌మావేశానికి అమెరికా ఆతిథ్యం ఇస్తున్న నేప‌థ్యంలో ఆక‌స్ గ్రూపు అంశం కూడా చ‌ర్చ‌నీయాంశమైంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/