రెండు వారాలో ట్రంప్ అభిశంసన విచారణ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై అభిశంసనకు సంబంధించిన విచారణ సెనేట్లో రెండు వారాల్లోనే తేలిపోతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. గతంలో 1999లో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ అభిశంసన విచారణ ఐదువారాల సమయం తీసుకోగా 1868లో అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్పై విచారణకు మూడు నెలల సమయం పట్టిందని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఇటు అధ్యక్ష భవనం, అటు రిపబ్లికన్ల ఆధిపత్యంలోని సెనేట్ ఏకాభిప్రాయంతో కొనసాగితే ఈ విచారణను రెండు వారాల్లో తేల్చివేయవచ్చని వారంటున్నారు. ఫిబ్రవరి 4న దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించేందుకు ముందే ట్రంప్ అభిశంసన నుండి నిర్దోషిగా బయటపడవచ్చని వారు చెబుతున్నారు. ట్రంప్పై మోపిన అభిశంసన అభియోగాలపై రిపబ్లికన్ల ఆధిపత్యంలోని సెనేట్ ఎటువంటి వైఖరి తీసుకుంటుందనే దానిపై ట్రంప్ భవిత ఆధారపడి వుంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రతినిధుల సభ పంపిన అభియోగాల పత్రాలను సెనేట్లో లాంఛన ప్రాయంగా చదువుతారు. అయితే ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను ఇంకా ఖరారు చేయలేదు. దీనిపై మంగళవారం నాడు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/