పుప్పాల్ గూడలో గోడ కూలి ఇద్దరు మృతి..

రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలోని పుప్పాలగూడలో ఈరోజు (శనివారం) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణానికి గుంత తీస్తుండగా గోడ కూలి ఇద్దరు మృతి చెందారు. మూడు ఫ్లోర్స్ కోసం సెల్లార్ గుంత తీయడంతో గోడ కూలిపోయింది. సెల్లార్ గుంతకు ఆనుకుని స్లాబ్ కోసం కార్మికులు సెంట్రింగ్ పనులు చేస్తుండగా..ఒక్కసారిగా గోడ కుంగిపోవడంతో సెంట్రింగ్ డబ్బాలు మీద పడి చనిపోయారు.

ప్రమాద సమయంలో 13 మంది కార్మికులు పని చేస్తున్నారు. మట్టి కింద పడగానే 11 మంది తప్పించుకోగా… ఇద్దరు మాత్రం మట్టి కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారు శ్రీకాకుళం వాసులుగా గుర్తించారు. నిర్మాణ సమయంలో కనీస జాగ్రత్తలు పాటించని నిర్మాణ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.