లక్నవరం చెరువులో మునిగి యువతీ , యువకుడి మృతి

ములుగు జిల్లా లక్నవరం చెరువులో విషాదం చోటుచేసుకుంది. లక్నవరం చెరువు చూసేందుకు హైదరాబాద్ నుండి వచ్చిన యువతీ , యువకులు ఈత కొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు యువతీ, యువకుడు నీటిలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఐసీఎఫ్ఏఐకు చెందిన ఆరుగురు (నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు) విద్యార్థుల టీమ్ లక్నవరం చెరువును చూసేందుకు సోమవారం వచ్చారు. ఈ క్రమంలో రెండో ఐలాండ్‌కు చేరుకొని సరదాగా సరస్సులోకి దిగారు.

ఈత కొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు యువతీ, యువకుడు నీటిలో మునిగిపోయారు. దీంతో తోటి స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చీకటి పడటంతో అప్రమత్తమై గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు. వారిద్దరి మృతదేహాలను బయటకు తీశారు. మృతులను హైదరాబాద్‌కు చెందిన సాయి ప్రీతమ్‌ (24), తరుణి (20)గా గుర్తించారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.