సూర్యాపేట జిల్లాలో పెను ప్రమాదం తప్పింది

సూర్యాపేట జిల్లాలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది.జిల్లాలోని చివ్వేంల మండలం గంపులగ్రామ శివారులో రెండు ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. అయితే బస్సులో ఎవరూలేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తెల్లవారు జామున గంపులగ్రామ శివారులో ఆర్టీసీ బస్సు ఆగిపోయింది.

దీంతో సిబ్బంది అందులో ఉన్న ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. అయితే నిలిచిపోయిన బస్సును రిపేర్‌ చేయడానికి సిబ్బంది మరో బస్సులో వచ్చారు. ఈ క్రమంలో ఆగిపోయిన బస్సులో ఉన్న బ్యాటరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఒక బస్సు నుంచి మరో బస్సుకు వేగంగా మంటలు వ్యాపించడంతో రెండూ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.