మీకు ఇష్టమొచ్చినన్ని రోజులు కావాలా?

గ్రీవెన్స్ ఆఫీసర్ ను ఇంకెప్పుడు నియమిస్తారు?..ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

న్యూడిల్లీ : కొత్త ఐటీ చట్టం అమలుపై ట్విట్టర్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్యల పరిష్కార అధికారి (గ్రీవెన్స్ ఆఫీసర్) నియామకంపై మీనమేషాలు లెక్కిస్తుండడంపై, చట్ట నిబంధనల అమలు ప్రక్రియ ఇంకా నడుస్తోందని ట్విట్టర్ సమాధానమివ్వడంపై అసహనం వ్యక్తం చేసింది. కొత్త ఐటీ చట్టాన్ని ట్విట్టర్ అమలు చేయట్లేదంటూ అమిత్ ఆచార్య అనే న్యాయవాది దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు ట్విట్టర్ తీరుపై మండిపడింది.

‘‘ఇంకెన్నాళ్లు టైం కావాలి? చట్టాన్ని అమలు చేసే ప్రక్రియ ఇంకెన్నాళ్లు నడుస్తుంది? మా దేశంలో ట్విట్టర్ ఎంత సమయం కావాలంటే అంత సమయం తీసుకుంటుందా? అంతా మీ ఇష్టమేనా? దాన్ని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోం’’ అని జస్టిస్ రేఖా పల్లి అన్నారు. ట్విట్టర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ సాజన్ పూవయ్య.. గ్రీవెన్స్ ఆఫీసర్ నియామకానికి మరో రెండు వారాలు గడువు కావాలని కోర్టును కోరారు. జూన్ 21నే ధర్మేంద్ర చాతుర్ రాజీనామా చేశారని, అప్పటి నుంచి భారత్ లోనే ఉండే గ్రీవెన్స్ ఆఫీసర్ ను ఎందుకు నియమించలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. రాజీనామా చేసిన చాతుర్.. అసలు తాత్కాలిక అధికారి అని ముందే ఎందుకు చెప్పలేదని మండిపడ్డారు. కోర్టును ట్విట్టర్ తప్పుదోవ పట్టించిందన్నారు.

కనీసం ఆ తాత్కాలిక అధికారి రాజీనామా చేశాకైనా పూర్తి స్థాయి గ్రీవెన్స్ అధికారిని నియమించాల్సిందని వ్యాఖ్యానించారు. గ్రీవెన్స్ ఆఫీసర్ ను ఎప్పుడు నియమిస్తారో, ఐటీ చట్టాన్ని ఎప్పుడు అమలు చేస్తారో పక్కా సమాచారం ఇవ్వాలని, అందుకు ఒక్కరోజు గడువు ఇస్తున్నామని స్పష్టం చేశారు. గురువారం లోగా ఏ విషయాన్నీ చెప్పాలని ఆదేశించారు. ట్విట్టర్ కచ్చితంగా ఐటీ చట్టంలోని నిబంధనలను పాటించాల్సిందేనని, ఇప్పటికే గడువు దాటిపోయిందని అన్నారు. సంస్థకు ఎలాంటి న్యాయ రక్షణ ఉండబోదని, సంస్థపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని సూచించారు. ఇప్పటికే కొత్త ఐటీ చట్టంతో ట్విట్టర్ రక్షణ కోల్పోయిందని చెప్పారు. సంస్థ భారత్ లో పనిచేయాలంటే.. ఇక్కడి నిబంధనలు, చట్టాలకు లోబడే పనిచేయాలని తేల్చి చెప్పారు.

అన్ని సంస్థలు ఐటీ చట్టాన్ని అమలు చేసేలా ఫిబ్రవరి 26న మూడు నెలల గడువు ఇచ్చామని, ట్విట్టర్ ఆ గడువు దాటి 41 రోజులు అయిపోయిందని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ట్విట్టర్ కూడా ఈ విషయాన్ని కోర్టు ముందు అంగీకరించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/