తిరుమల రెండో ఘాట్ రోడ్డులో రాకపోకలు ప్రారంభం
అమరావతి : వైకుంఠ ఏకాదశి సందర్భంగా అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డును అందుబాటులోకి తేనుంది. ఘాట్ రోడ్ మరమ్మతు పనులను పరిశీలించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 11 రాత్రి నుంచి భక్తులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. జనవరి 9న ఘాట్రోడ్లో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించిన ఆయన ఈ విషయం వెల్లడించారు. జనవరి 11 రాత్రికల్లా ఘాట్ రోడ్డును భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
కాగా, గత నెలలో కురిసిన భారీ వర్షాలతో ఘాట్ రోడ్డు వద్ద కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. పెద్ద బండరాళ్లు పడడంతో రెండో ఘాట్ రోడ్డులోని చివరి మలుపు వద్ద రహదారి భారీగా కోతకు గురైంది. దీంతో రెండో ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలను టీటీడీ అధికారులు నిలివేశారు. ధ్వంసమైన ఘాట్ రోడ్డు మరమ్మతులు శరవేగంగా పూర్తి చేశారు. రేపటి నుంచి రెండో ఘాట్ రోడ్డు మీద నుంచి వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/