దేవ‌స్థాన‌ సేవలన్నీ ఒకే యాప్ లో:వైవీ సుబ్బారెడ్డి

రాబోయే వైకుంఠ ఏకాదశి రోజున యాప్‌ ఆవిష్కరణ‌

తిరుమల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ సేవలన్నీ ఒకే యాప్ లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉండ‌నున్నాయ‌ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. భక్తుల సౌకర్యార్థం దీన్ని అందుబాటులోకి తీసుకు వ‌స్తున్నట్లు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ యాప్ ద్వారా భక్తులకు అవసరమైన వసతి, దర్శనం లాంటి సకల బుకింగ్‌ల‌ సేవలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని చెప్పారు.

అంతేకాదు, ఆ యాప్‌ను ఉచితంగా రూపొందిచేందుకు జియో సంస్థ ముందుకు వ‌చ్చింద‌ని, టీటీడీ, జియో సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింద‌ని ప్ర‌క‌టించారు. రాబోయే వైకుంఠ ఏకాదశి రోజున యాప్‌ను ఆవిష్కరించేలా ఏర్పాటు చేయాలని జియో సంస్థను కోరామ‌ని చెప్పారు. ఐదేళ్లుగా త‌మ‌కు ఉచితంగా సాంకేతిక సహకారం అందిస్తున్న టీసీఎస్‌ సమన్వయంతో జియో సంస్థ కూడా టీటీడీ ఐటీ విభాగానికి మెరుగైన సేవలు అందిస్తోందని వైవీ సుబ్బారెడ్డి వివ‌రించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/