శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల

tirumala temple
tirumala temple

తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధించిన కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. జనవరి 4 నుండి 31వ తేదీ వరకు రోజుకు 20 వేల టికెట్ల చొప్పున రూ. 300 టికెట్లను అందుబాటులో ఉంచామని, ఒక్కో యూజర్ ఐడీపై ఆరు వరకూ టికెట్లను కొనుగోలు చేయవచ్చని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి నిమిత్తం పరిమిత సంఖ్యలోనే స్వామివారి దర్శనాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 25 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలావుండగా భక్తులు అపురూపంగా చూసుకునే టీటీడీ కొత్త క్యాలెండర్లు, డైరీలకు తీవ్ర కొరత ఏర్పడింది. 2021 సంవత్సరానికి సంబంధించిన పెద్ద డైరీలు, 12 పేజీల క్యాలెండర్ల స్టాక్స్ లేవని భక్తులు అంటున్నారు. వైకుంఠ దర్శనాలకు వచ్చిన భక్తుల్లో అత్యధికులు ఈ క్యాలెండర్లు, డైరీల కోసం పుస్తక విక్రయశాలల వద్ద బారులు తీరుతున్నారు. చిన్న డైరీలు, చిన్న క్యాలెండర్లు, పంచాంగాలు, టేబుల్ క్యాలెండర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, పెద్ద డైరీలను కూడా అందుబాటులో ఉంచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/