అమరావతి : వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్‌కు ఆహ్వానం

అమరావతిలో కొత్తగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని ఆహ్వానించారు టీటీడీ. ఆహ్వాన పత్రాన్ని ముఖ్యమంత్రికి టీటీడీ ఛైర్మన్‌ అందజేశారు. అమ‌రావ‌తిలో శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యం ఉండాల‌న్న దిశ‌గా గ‌త టీడీపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం కార్య‌రూపం దాల్చింది. టీడీపీ పాల‌న‌లోనే అమ‌రావతిలో టీటీడీ ఆధ్వ‌ర్యంలో శ్రీవేంకటేశ్వ‌ర‌స్వామి ఆల‌య నిర్మాణ ప‌నులు మొద‌ల‌య్యాయి. ఈ ప‌నులు ఇప్ప‌టికే పూర్తి కాగా… ఈ నెల ఆల‌య ప్రారంభోత్స‌వానికి రంగం సిద్ధ‌మైంది.

ఈ మేర‌కు బుధ‌వారం తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి వేద పండితుల‌తో కలిసి సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారు. అమ‌రావ‌తిలో నిర్మాణం పూర్తి చేసుకున్న శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌య ప్రారంభోత్స‌వానికి జ‌గ‌న్‌ను ఆహ్వానించారు. ఆల‌య ప్రారంభోత్స‌వంంలో భాగంగా ఈ నెల 4నుంచి పూజా కార్యక్రమాలు, 9న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ఉంటాయ‌ని వైవీ సుబ్బారెడ్డి ప్ర‌క‌టించారు. ఈ సందర్భంగా సీఎంకు స్వామివారి ప్రసాదాలు అందజేసిన టీటీడీ వేద పండితులు.. వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్‌ వెంట జేఈవో వి.వీరబ్రహ్మం, సీఎస్‌వో నరసింహ కిశోర్, చీఫ్‌ ఇంజనీర్‌ డి.నాగేశ్వరరావు ఉన్నారు.