తిరుమలలో వసతి గృహాల అద్దె చూస్తే షాకే

తిరుమలలో వసతి గృహాల అద్దెను భారీగా పెంచారు. మొన్నటి వరకు రూమ్ అద్దె రూ.150 లు ఉండేది. ఇప్పుడు దానిని రూ. 1700 కు పెంచారు. ఈ పెంపు చూసి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతి రోజు వేల సంఖ్యలో వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. కాస్త డబ్బున్న వారు ప్రవైట్ హోటల్స్ , లాడ్జ్ లలో అద్దెకు ఉండగా, మధ్యతరగతి ప్రజలు మాత్రం టీటీడీ వసతి గృహాల్లో అద్దెకు ఉంటారు. బయట లాడ్జ్ లతో పోలిస్తే చాల తక్కువ గా ఉంటుందని వారంతా టీటీడీ వసతి గృహాల్లో ఉండేందుకు పోటీపడతారు. ఇప్పుడు టీటీడీ వసతి రూమ్ లు సైతం ప్రవైట్ లాడ్జ్ లకు మించి వసూళ్లు చేయడం మొదలుపెట్టాయి.

మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల అద్దెలను రూ. 500, రూ. 600 నుంచి రూ. 1000కి పెంచారు. అలాగే, ఈ నెల 1 నుంచి నారాయణగిరి రెస్ట్ హౌస్‌లోని 1, 2, 3 గదులను రూ. 150 నుంచి జీఎస్టీతో కలిపి రూ 1,700 పెంచారు. రెస్ట్‌హౌస్‌ 4లో ఒక్కో గదికి ప్రస్తుతం రూ. 750 వసూలు చేస్తుండగా ఇప్పుడు దానిని 1,700కు పెంచారు. కార్నర్ సూట్‌ను జీఎస్టీతో కలిపి రూ. 2,200 చేశారు. స్పెషల్ టైప్ కాటేజీల్లో గది అద్దెను రూ. 750 నుంచి 2,800కు పెంచారు.

అద్దె మొత్తాన్ని పెంచడమే కాదు, అద్దెతోపాటు అంతే మొత్తంలో డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ రూ. 1,700 గదిని అద్దెకు తీసుకుంటే అంతే మొత్తంలో డిపాజిట్ అంటే మరో రూ.1700 కలిపి మొత్తం రూ. 3,400ను చెల్లించాల్సి ఉంటుంది. తిరుమలలో ఉన్న 6 వేల గదుల్లో ఇటీవల ఆధునికీకరణ పనులు చేపట్టారు. రూ. 110 కోట్లతో టెండర్లు ఆహ్వానించి ఏసీ, గీజర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. సౌకర్యాల కల్పన అనంతరం అద్దెను భారీగా పెంచారు. అంతే కాదు సామాన్య భక్తులు ఎక్కువగా బస చేసే రూ. 50, రూ.100తో లభించే గదుల అద్దెలను కూడా త్వరలో పెంచనున్నట్టు తెలుస్తోంది. ఈ అద్దె ధరలు చూసి సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. నిలువు దోపిడీ అంటే ఇలా కూడా చేస్తారా అని షాక్ అవుతున్నారు.