శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు కన్నుమూత
రెండు దశాబ్దాలకు పైగా శ్రీవారి సేవలో తరించిన దీక్షితులు
తిరుమల: శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనాతో కన్నుమూశారు. పది రోజుల క్రితం శ్రీనివాసమూర్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. స్విమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం శ్రీనివాస మూర్తి మృతి చెందారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకునిగా శ్రీనివాసమూర్తి దీక్షితులు 20 సంవత్సరాల పాటు కొనసాగారు. 2018వరకు ప్రధాన అర్చకుల హోదాలో శ్రీవారి కైంకర్యాలు నిర్వహించిన శ్రీనివాసమూర్తి దీక్షితులు, పెద్దింటి వంశపర్యంపర్య అర్చకులుగా టిటిడి అధికారులు తెలిపారు. కాగా ఆయనకు ఆలయం తరపున సంప్రదాయ పద్ధతిలో అంతిమ వీడ్కోలు నిర్వహించాల్సి ఉంది. అయితే, ఆయన కరోనాతో మృతి చెందడంతో ఇది సాధ్యమయ్యే పని కాదని తెలుస్తోంది. అంతేకాదు, ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు కానీ, మరొకరికి కానీ అప్పగించే అవకాశం కూడా లేదని సమాచారం.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/