త్వరలో కూల్చివేయనున్న వందేళ్ల నాటి నిర్మాణం
నిజాం పాలనలో నిర్మించిన రాతి కట్టడం
హైదరాబాద్: నగరంలో సుమారు వందేళ్ల చరిత్ర కలిగిన నిర్మాణం త్వరలో కూల్చివేతకు గురి కానుంది. స్టోన్ బిల్డింగ్ గా పిలవబడే ఈ చారిత్రాత్మక కట్టడం నేలమట్టం కానుంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సెక్రెటేరియట్ కు వాస్తు సమస్య ఉన్న కారణంగా తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం టిఎస్ఎస్పిడిసిఎల్ కు సంబంధించిన కార్యాలయాలు ఈ భవనంలో ఉన్నాయి, అయితే ఈ నిర్మాణం1910లో నిజాం పాలనలో పూర్తిగా రాతితో నిర్మింపబడింది. సెక్రటేరియట్ అవుట్ గేట్ పక్కనే మింట్ కాంపౌండ్లో ఈ భవనం ఉంది. రాతి కట్టడమైన ఈ భవనానికి చాలా చరిత్ర ఉంది. దక్షిణాసియాలోనే తొలిసారిగా హైదరాబాద్ రాష్ట్రంలో నిర్మించిన తొలి థర్మల్ పవర్ స్టేషన్ ఈ భవనంలోనే ఉండేది. ఉస్మానియా టెక్నికల్ కాలేజ్ కూడా కొన్నాళ్లపాటు ఈ భవనంలోనే కొనసాగింది. ప్రస్తుతం ఉన్న టిఎస్ఎస్పిడిసిఎల్ సంబంధిత కార్యాలయాలను వెంటనే ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నుంచి అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. మరోవైపు, నిర్మించి వందేళ్లు అయినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న ఈ భవనాన్ని కూల్చడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజా బిసినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/