ఏపీ ప్రయాణికుల కోసం స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చిన టిఎస్ ఆర్టీసీ
టిఎస్ ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీ ప్రయాణికుల కోసం స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈరోజు నుండి 10 స్లీపర్ బస్సులను అందుబాటులోకి రాబోతున్నాయి. వీటిలో నాలుగు పూర్తిస్థాయి స్లీపర్ బస్సులు కాగా, ఆరు స్లీపర్ కమ్ సీటర్ బస్సులు. ఈ బస్సులు హైదరాబాద్ నుంచి కాకినాడ, విజయవాడ మధ్య పరుగులు పెట్టనున్నాయి. నేటి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ బస్ స్టాప్ వద్ద టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ వీటిని ప్రారంభిస్తారు.
హైదరాబాద్ నుంచి కాకినాడ వైపు వెళ్లే బస్సులు ప్రతిరోజూ రాత్రి 7.45, 8.30 గంటలకు బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరుతాయి. తిరిగి కాకినాడలో రాత్రి 7.15, 7.45 గంటలకు బయలుదేరుతాయి. అలాగే, విజయవాడ వైపు వెళ్లే బస్సులు మియాపూర్ నుంచి ప్రతిరోజూ ఉదయం 9.30, 10.45, 11.45 గంటలకు, రాత్రి 9.30, 10.15, 11.15 గంటలకు బయలుదేరుతాయి. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి ఉదయం 10.15, 11.15, మధ్యాహ్నం 12.15 గంటలకు, అర్ధరాత్రి 12.00, 12.45 గంటలకు తిరిగి బయలుదేరనున్నాయి.