దేశంలోనే తొలిసారిగా బస్సుల్లో ఐ-టిమ్‌ తీసుకొచ్చిన టీఎస్ ఆర్టీసీ

టీఎస్ ఆర్టీసీ సరికొత్త ఆలోచనలతో పాటు సాంకేతికంగా కూడా సరికొత్త పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే ఎన్నో ఆఫర్లను తీసుకొస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంటూ వస్తున్న ఆర్టీసీ..తాజాగా దేశంలోనే తొలిసారిగా బస్సుల్లో ఐ-టిమ్‌(ఇంటెలిజెంట్‌ టికెట్‌ ఇష్యూ మిషన్‌) ను తీసుకొచ్చి వార్తల్లో నిలిచింది. టికెట్ల జారీని మరింత సులభతరం చేసేందుకు ఇప్పటికే టిమ్‌ (టికెట్‌ ఇష్యూ మిషన్‌) సేవలను అందిస్తోంది. ఇపుడు మరింత ఆధునికంగా.. దేశంలోనే తొలిసారిగా బస్సుల్లో ఐ-టిమ్‌(ఇంటెలిజెంట్‌ టికెట్‌ ఇష్యూ మిషన్‌)లను అందుబాటులోకి తెచ్చింది.

ప్రయాణానికి 20 నిమిషాల ముందు సీట్ల అందుబాటును బట్టి ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ చేసుకోచ్చు. బస్సు ఎక్కడ ఉంది, ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, మన స్టేజీకి రావడానికి ఎంత సమయం పడుతుంది.. వంటి వివరాలన్నీ ఐ-టిమ్‌ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను స్వైప్‌ చేయడం, గూగుల్‌ పే, ఫోన్‌పే ద్వారా కూడా టికెట్‌ ఛార్జీలు చెల్లించడానికి వెసులుబాటు లభిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవల కోసం ఆర్టీసీ ఇప్పటికే 928 ఐ-టిమ్‌లు కొన్నట్లు సమాచారం. ఐ-టిమ్‌లను ముందుగా దూరప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల్లో తీసుకరాబోతున్నారు. ఇప్పటికే వీటిని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్‌ బస్సుల్లో అందుబాటులోకి తెచ్చారు. అనంతరం దూరప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సుల్లో అమలుచేసి, దశలవారీగా అన్ని సర్వీసుల్లో ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. జులై నెలలో కరీంనగర్‌ రీజియన్‌లో గరుడ, గరుడప్లస్‌, రాజధాని, ఇంద్ర లాంటి సర్వీసుల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. ఇక రేపు ఫాదర్స్‌ డే సందర్భంగా తెలంగాణ ఆర్టీసీలో చిన్నారుల తండ్రులకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రయాణించవచ్చు.