సంక్రాంతి పండగ టీఎస్ఆర్టీసీ కి బాగా కలిసొచ్చింది

సంక్రాంతి పండగ టీఎస్ఆర్టీసీకి బాగా కలిసొచ్చింది. సంక్రాంతి సందర్బంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వందలాది బస్ సర్వీస్ లను అందుబాటులో ఉంచడం..ప్రత్యేక బస్సుల్లోనూ ఎలాంటి అదనపు ఛార్జి లు వసూళ్లు చేయకపోవడం తో ప్రతి ఒక్కరు ఆర్టీసీ వైపే మొగ్గు చూపించారు. దీంతో ఆర్టీసీకి భారీ లాభాలు వచ్చాయి. ఈ పండుగ సీజన్లో టీఎస్ ఆర్టీసీకి రూ. 165.46 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.
గత ఏడాది కన్నా రూ. 62.29 కోట్ల ఆదాయం అదనంగా వచ్చిందని, 11 రోజుల్లో 2.82 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించినట్లు తెలిపారు. కేవలం జనవరి 11 నుంచి 14 తేదీల్లో అంటే నాలుగు రోజుల్లోనే 1.21 కోట్ల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని , గతేడాదితో పోల్చితే ఆ నాలుగు రోజుల్లోనే 5 లక్షల మంది అధికంగా ప్రయాణించినట్లు సజ్జనార్ తెలిపారు. ఇదంతా పోలీసులు, ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్ అధికారులు, టీఎస్ ఆర్టీసీ సిబ్బంది వల్లే సాధ్యమైందని చెపుతూ వారిని అభినందించారు.