TSPSC పేపర్ లీకేజీ కేసు : రంగంలోకి ఈడీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న TSPSC పేపర్ లీకేజ్ ఘటన కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో జరిగిన డబ్బు లావాదేవీల గుట్టు తేల్చేందుకు (ఈడీ) రంగంలోకి దిగింది. పేపర్ కొనుగోలు కోసం రూ.లక్షల్లో డబ్బు చేతులు మారినట్లు సిట్ దర్యాఫ్తులో ఇప్పటికే వెల్లడైంది. దీంతో డబ్బు ఎవరెవరి చేతులు మారింది, వారికి ఎక్కడి నుంచి సమకూరిందనే వివరాలపై అధికారులు విచారించనున్నట్లు సమాచారం. ఈ వ్యవహారాలకు సంబంధించి కేసు నమోదు చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైందని తెలుస్తోంది.
ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి తొలుత బేగంబజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత దాన్ని సీసీఎస్కు బదిలీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు గ్రూప్-1 పరీక్షలో 100 మార్కులకు పైగా సాధించిన అభ్యర్థులను సైతం విచారిస్తున్నారు. ఈ వ్యవహారంపై నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనుంది. సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేసిన డేటా లీకేజీపైనా ప్రత్యేకంగా మరో కేసు నమోదు చేసింది.
ప్రవీణ్ పెన్డ్రైవ్లో 6 పరీక్షలకు సంబంధించి 15 ప్రశ్నపత్రాలను సిట్ అధికారులు గుర్తించారు. పేపర్ లీకేజీ ద్వారా ప్రవీణ్ కుమార్, రాజశేఖర్రెడ్డి లక్షలు వెనకేసుకున్నారు. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏడు పరీక్షలలో ఐదు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని దర్యాప్తులో నిర్ధారణ జరిగింది. ప్రవీణ్ తన స్నేహితురాలు రేణుకకు రూ. 10 లక్షలకు అమ్మగా.. భర్తతో కలిసి రేణుక ఆ పేపర్లను మరో ఐదుగురికి అమ్మి రూ.25 లక్షలు వసూలు చేసింది.