ఏఈ పరీక్ష రద్దుపై మార్చి 15న నిర్ణయం – TSPSC ఛైర్మన్

ఏఈ పరీక్ష రద్దుపై మార్చి 15న నిర్ణయం తీసుకుంటామన్నారు TSPSC ఛైర్మన్ జనార్ధర్ రెడ్డి. TSPSC పేపర్ లీక్ చేసిన ప్రవీణ్‌ వ్యవహారంపై మంగళవారం TSPSC ఛైర్మన్ జనార్ధర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. పేపర్ లీకేజీ నిందితులను సిట్ అదుపులోకి తీసుకుందని, ప్రవీణ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించామని తెలిపారు. ప్రవీణ్ హ్యాకింగ్ చేసినట్లు గుర్తించామని, పేపర్ను రూ.10 లక్షలకు అమ్మినట్లు గుర్తించామని చెప్పారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక నివేదిక అందుతుందని ఆయన తెలిపారు. అధికారిక నిర్ణయం వచ్చిన తర్వాతే పరీక్ష రద్దుపై నిర్ణయం తీసుకుంటామని జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు.

టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్స్ లో మాస్ కాపీయింగ్ జరిగే అవకాశం లేదని చెప్పారు. టీఎస్ పీఎస్సీలో రాజశేఖర్ రెడ్డి ఆరేళ్లుగా నెట్ వర్క్ ఎక్స్ పర్ట్ గా పనిచేస్తున్నాడని అతనికి ఐపీ అడ్రస్ లు అన్నీ తెలుసన్నారు. రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ ఇద్దరు కలిసే పేపర్ లీక్ చేశారని వెల్లడించారు. పేపర్ తీసుకున్న నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ రాశారని చెప్పారు. తమ కుటుంబ సభ్యులెవరు గ్రూప్ 1 ఎగ్జామ్ రాయలేదని జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. తన కూతురు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇప్పటి వరకు టీఎస్ పీఎస్సీ ద్వారా 26 నోటిఫికేషన్లు ఇచ్చామని వెల్లడించారు. గ్రూప్ 1 లో నిందితుడు ప్రవీణ్ కు వచ్చిన 103 మార్కులే టాప్ మార్కులు కావన్నారు. ప్రవీణ్ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్లు చాలా మంది ఉన్నారని చెప్పారు.