తీన్మార్​ మల్లన్న పిటిషన్​ పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం

హైదరాబాద్ : తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ వేసిన పిటిషన్ పై వెంటనే కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇవాళ మల్లన్న వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇటీవల తీన్మార్ మల్లన్న ఆఫీసులపై పోలీసులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. పలు హార్డ్ డిస్క్ లను పట్టుకెళ్లారు. తెల్లారే సికింద్రాబాద్ లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఈ నేపథ్యంలోనే తనను పోలీసులు వేధిస్తున్నారని, కారణాల్లేకుండా పోలీస్ స్టేషన్ కు పిలుస్తున్నారని పేర్కొంటూ హైకోర్టులో మల్లన్న పిటిషన్ వేశారు. సీసీఎస్, చిలకలగూడ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారని అందులో పేర్కొన్నారు. పదే పదే తనను స్టేషన్ కు పిలవకుండా ఆన్ లైన్ లోనే దర్యాప్తు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/